: పొలిటికల్ పంచ్ రవికిరణ్ కు, మాకు సంబంధం లేదు: వైసీపీ ఐటి వింగ్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి

పొలిటికల్ పంచ్ రవికిరణ్ తో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఐటీ వింగ్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. వైసీపీకి ఉన్న లక్షలాది మంది మద్దతుదారుల్లో రవికిరణ్ కూడా ఒకడని చెప్పారు. రవికిరణ్ కేసు విషయంలో ఈ రోజు మధుసూదర్ రెడ్డి అమరావతి పోలీసుల విచారణకు హాజరయ్యారు. విచారణ  అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈనెల 30వ తేదీన మరోసారి విచారణకు రమ్మన్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కు వ్యతిరేకంగా తాము ఎలాంటి పోస్టులు పెట్టలేదని... భవిష్యత్తులో కూడా పెట్టమని తెలిపారు. కేవలం ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై మాత్రమే పోస్టింగ్ లు పెడతామని చెప్పారు. రవికిరణ్ తో వైసీపీకి సంబంధం లేదని, ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పానని తెలిపారు. అయితే ఇలాంటి తాటాకు చప్పుళ్లకు, ఉడుత బెదిరింపులకు తాము భయపడమని అన్నారు.

గతంలో తమ అధినేత జగన్ పై, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ అసభ్యకరమైన పోస్టులు పెట్టిందని... వీటిపై తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మధుసూదన్ అన్నారు. సాక్ష్యాలు ఉన్నప్పటికీ తన ఫిర్యాదును స్వీకరించలేదని విమర్శించారు. 

More Telugu News