: దినకరన్ ను అరెస్ట్ చేశారా? అంటూ ప్రశ్నించిన కోర్టు

రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వడానికి సిద్ధమైన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫెరా కేసు, పార్టీ నుంచి బహిష్కరణ యత్నాలు ఆయనను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫెరా కేసు విచారణకు సంబంధించి దినకరన్ ప్రతి రోజు తమిళనాడులోని ఎగ్మూర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

ఢిల్లీలో విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, నిన్న ఆయన ఎగ్మూర్ కోర్టుకు హాజరు కాలేకపోయారు. దీంతో దినకరన్ కోర్టుకు ఎందుకు రాలేదంటూ జడ్జి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... ఢిల్లీ పోలీసుల సమక్షంలో విచారణ కొనసాగుతోందని, అందువల్ల ఆయన కోర్టుకు రాలేకపోయారని న్యాయవాది చెప్పారు. ఈ సందర్భంగా జడ్జి జోక్యం చేసుకుంటూ... దినకరన్ ను అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ఇందుకు... దినకరన్ ను అరెస్ట్ చేయలేదని లాయర్ సమాధానం చెప్పారు. ఒకవేళ దినకరన్ ను అరెస్ట్ చేస్తే, ఆ విషయాన్ని కోర్టుకు తెలపాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు జడ్జి. 

More Telugu News