: ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేసిన తెలంగాణ సర్కారు.. దేశంలోనే వినూత్న విధానం!

ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. వాహనాలను అడ్డగోలుగా నడుపుతూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలను సవరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణలకు పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇక మునుపటిలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పోదు. డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏళ్లపాటు రద్దు చేస్తారు.

ఇక పాయింట్ల విషయానికొస్తే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిసారీ వాహనదారుడి ఖాతాలో పాయింట్లు నమోదవుతుంటాయి. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఒకటి, రాంగ్ రూట్‌లో వెళ్తే రెండు.. ఇలా ప్రతి అతిక్రమణకు కొన్ని పాయింట్లు ఇస్తారు. ఇవి రెండేళ్ల కాలంలో 12 దాటితే వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏడాది పాటు రద్దు చేస్తారు.  ఆ తర్వాత కూడా అదే తీరు కొనసాగితే ఈసారి రెండేళ్లు రద్దు చేస్తారు. ఇలా ప్రతి ఏడాది రద్దు పెరుగుతూ పోతుంది. లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారు దాని చెల్లుబాటు వ్యవధిలో 5 పెనాల్టీ పాయింట్లు కనుక ఎదుర్కొంటే లైసెన్స్ రద్దయిపోతుంది. ఫలితంగా మరోమారు లెర్నర్స్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టడం దేశంలోనే ఇది తొలిసారని రవాణాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

More Telugu News