: మళ్లీ మొదటికొచ్చిన విలీన ప్రక్రియ.. శశికళను బహిష్కరిస్తేనే ముందుకెళ్దామన్న ఓపీఎస్ వర్గం

రెండుగా చీలిన అన్నాడీఎంకే ఒక్కటవ్వాలన్న కోరిక ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. చర్చలు ఎటూ ఎడతెగడం లేదు. ముఖ్యమంత్రి పళని వర్గం ముందు ఉంచిన డిమాండ్లు నెరవేరిస్తేనే విలీనం గురించి ఆలోచిద్దామని పన్నీర్ వర్గం తేల్చి చెబుతోంది. శశికళ, ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి పంపించడంతోపాటు జయ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే చర్చల సంగతి చూద్దామని కుండబద్దలు కొట్టింది. నిజానికి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో విలీనంపై ఇరు వర్గాలు చర్చించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం ఓపీఎస్ వర్గానికి చెందిన కేపీ మునుస్వామి, ఎంపీ మైత్రేయన్‌లు విలేకరులతో మాట్లాడుతూ తాము విధించిన రెండు డిమాండ్లు నెరవేరితేనే చర్చల విషయాన్ని ఆలోచిద్దామని పేర్కొన్నారు.

 ఆయన ప్రకటనతో షాకైన ఈపీఎస్ వర్గం చివరి క్షణంలో ఇటువంటి మెలికలు సరికాదని అసంతృప్తిని వ్యక్తం చేసింది. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని, కాబట్టి చర్చలకు రావాలని కోరింది. మరోవైపు శశికళను పార్టీ నుంచి తొలగించాలన్న ఓపీఎస్ డిమాండ్‌పై చర్చించేందుకు బుధవారం పార్టీలో అత్యంత కీలకమైన జిల్లా కార్యదర్శులతో భేటీ కావాలని సీఎం పళనిస్వామి నిర్ణయించారు. కాగా, సోమవారం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోని శశికళ చిత్రపటాలను సీఎం పళనిస్వామి ఉండగానే తొలగించారు.

More Telugu News