: ప్రణబ్ ముఖర్జీవైపే మొగ్గు చూపుతున్న కాంగ్రెస్?

ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్రపతి ఎన్నికలపైనే ఉంది. త్వరలోనే రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనుండటంతో... కాబోయే రాష్ట్రపతి ఎవరు? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తమ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో ఎన్డీఏ, యూపీఏలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా రాష్ట్రపతి పదవిని తామే కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవల కాలంలో పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బాగా కలసి వచ్చే అంశం. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములు కావడం.. బీజేపీలో జోష్ పెంచుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలా? అనే పనిలో బీజేపీ అధిష్ఠానం తలమునకలై ఉంది.

మరోవైపు, తాము కూడా రాష్ట్రపతి పదవికోసం అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. జేడీయూ, లెఫ్ట్ పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ నేతలు ఈ పార్టీలతో ఇప్పటికే మంతనాలు జరిపారు. నితీష్ కుమార్, సీతారాం ఏచూరీలు సోనియాగాంధీతో ఈ విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ అంశంపై సోనియాతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపుతున్నారని సమాచారం. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం బీజేపీ ప్రదర్శిస్తున్న దూకుడును తగ్గించాలంటే... మళ్లీ ప్రణబ్ ముఖర్జీనే రెండోసారి రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.

More Telugu News