: దిగ్విజయ్ సింగ్ సమక్షంలో నారాయణరెడ్డి చెంప చెళ్లుమనిపించిన కోమటిరెడ్డి!

కాంగ్రెస్‌లో మరోమారు విభేదాలు బయటపడ్డాయి. సాక్షాత్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి చెంప చెళ్లుమనిపించారు. నల్గొండ జిల్లా నుంచి విడిపోయిన భువనగిరి-యాదాద్రి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఇటీవల ముఖ్యనేతల అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్గొండ  జిల్లా పార్టీ అధ్యక్షుడైన మాజీ ఎమ్మెల్యే బి.భిక్షమయ్య గౌడ్ ఆసక్తిగా ఉన్నారని, ఆయనను ఎంపిక చేస్తేనే మంచిదని దిగ్విజయ్ సింగ్‌కు నారాయణరెడ్డి సూచించారు.

దీంతో దిగ్విజయ్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ అభిప్రాయం కోరారు.  స్పందించిన ఆయన తన అభిప్రాయానికి విలువ ఇచ్చి తాను చెప్పిన వ్యక్తినే డీసీసీ అధ్యక్షుడిగా చేయాలని పేర్కొన్నారు. దీంతో జోక్యం చేసుకున్న నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టులతో కోట్లు సంపాదిస్తున్న ఆయన అభిప్రాయానికి విలువ ఇవ్వాల్సిన పనిలేదని పేర్కొన్నారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. బ్రోకర్ పనులు చేసేదే నీవని, గ్యాంగ్‌స్టర్ నయీంతో భూ దందాలు చేసిన చరిత్ర నీదంటూ నారాయణరెడ్డిపై రాజ్‌గోపాల్ విరుచుకుపడ్డారు. అలా ఘర్షణ కాస్తా పెద్దదైంది. ఆగ్రహం పట్టలేని రాజ్‌గోపాల్.. నారాయణరెడ్డి చెంపను చెళ్లుమనిపించారు. దీంతో నివ్వెరపోయిన దిగ్విజయ్ తేరుకుని ఇద్దరికీ సర్దిచెప్పినట్టు సమాచారం.

More Telugu News