: రేవంత్‌రెడ్డి వచ్చాకే తాళికడతానన్న అభిమాని.. హుటాహుటిన బయలుదేరిన రేవంత్!

మరికొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు మొండికేశాడు. టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వచ్చాకే తాళి కడతానని భీష్మించుకున్నాడు. చివరికి పంతం నెగ్గించుకున్నాడు. ముహూర్తానికి మూడు గంటల తర్వాత వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు. షాద్‌నగర్‌లో జరిగిందీ ఘటన. వేపంజర్ల గ్రామానికి చెందిన మహేశ్‌యాదవ్ తెలుగుదేశం పార్టీ అభిమాని. తెలంగాణ రేవంత్ సైన్యం (టీజీఆర్ఎస్)లో సభ్యుడు కూడా.

ఇటీవల షాద్‌నగర్‌కు చెందిన యువతితో మహేశ్‌కు వివాహం నిశ్చయమైంది. తన వివాహానికి రావాలంటూ ఆయన రేవంత్‌రెడ్డిని ఆహ్వానించాడు. గురువారం ఘనంగా పెళ్లి జరుగుతోంది. ముహూర్త సమయానికి కూడా రేవంత్‌రెడ్డి రాకపోవడంతో ఆయన వచ్చాకే వధువు మెడలో తాళి కడతానని మహేశ్ తేల్చి చెప్పడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. ఎవ్వరు నచ్చజెప్పినా వినలేదు. దీంతో టీజీఆర్ఎస్ అధ్యక్షుడు జయంత్, మరికొందరు నేతలు కలిసి వెంటనే హైదరాబాద్ వచ్చి రేవంత్‌రెడ్డిని కలిసి విషయం చెప్పారు. అప్పటికే చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన వారితో కలిసి షాద్‌నగర్ వచ్చారు. అభిమాన నేతను చూసిన ఆనందంలో మహేశ్ వధువు మెడలో తాళికట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News