: ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశంలో తీసుకున్న కీల‌క నిర్ణ‌యాలు ఇవే!

అమ‌రావ‌తిలో ఆంధ‌ప్రదేశ్ మంత్రివ‌ర్గ స‌మావేశం సుదీర్ఘంగా కొన‌సాగుతోంది. ఈ భేటీలో కేబినెట్ పలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వ‌చ్చే నెల 1 వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్రస్తుతం ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగుల జాబితా తయారు చేయాలని, మే 18 నుంచి బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. వ‌చ్చేనెల‌ 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. అలాగే ఆస్తుల విభ‌జ‌న‌పై కేబినెట్ ప్ర‌ధానంగా చ‌ర్చించింది.

ఆస్తుల విభ‌జ‌న అంశంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై అభ్యంత‌రం తెలిపింది. న్యాయబ‌ద్ధ‌మైన వాటా కోసం కేంద్ర‌ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవ‌డానికి మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. అప్పులు పంచి ఆస్తులు మాత్రం పంచ‌నంటే ఎలా? అని మంత్రులు అన్నారు. కేంద్ర స‌ర్కారు త‌మ విజ్ఞ‌ప్తిని విన‌కుంటే న్యాయ‌బ‌ద్ధంగా పోరాటం చేద్దామ‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు అభిప్రాయ‌ప‌డ్డారు.

 కాగా, భూసేక‌ర‌ణ నిర్వ‌హించ‌డానికి అధికారుల‌తో ఒక క‌మిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. అనంత‌పురం నుంచి అమ‌రావ‌తికి రూ.24 వేల కోట్లతో ర‌హ‌దారి నిర్మాణంపై కూడా మంత్రివ‌ర్గం చర్చించింది. కాంట్రాక్టు కార్మికుల జీతాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిర్చి, కంది, పసుపు రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది.

More Telugu News