: రోగి గుండెలో రూ.90 లక్షల ఖరీదైన పరికరాన్ని అమర్చిన వైద్యులు!

ఆరోగ్యం బాగోలేక‌పోతే ఎన్నో ఆసుప‌త్రులు తిరుగుతాం.. ప్రాణం క‌న్నా విలువైంది ఏదీ లేద‌ని, ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేదని వైద్యం చేయించుకోవ‌డానికి వెన‌కాడబోం. ముంబై నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త కూడా అటువంటి ప‌నే చేసి వార్త‌ల్లోకెక్కాడు. గుండె మార్పిడి అయ్యే ఖ‌ర్చుకి మూడు రెట్లు అధికంగా డ‌బ్బుచెల్లించి తన గుండె బాగు చేయించుకోడానికి ఓ విలువైన ప‌రిక‌రాన్ని పెట్టించుకున్నాడు. ముంబైలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో ఆయ‌న గుండెకు వైద్యులు రూ. 90 లక్షల విలువచేసే ఖరీదైన లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైజ్ (ఎల్‌వీఏడీ) అనే పరికరాన్ని పెట్టారు. దోషి (49) అనే ఆ వ్యాపారికి టీబీ కూడా ఉండ‌డ‌తో ఆయ‌న‌కు గుండె ఆప‌రేష‌న్ చేయ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌ని వైద్యులు చెప్ప‌డంతో, ఇంత ఖ‌ర్చుతో కూడిన పరికరాన్ని ఆయన గుండెకు అమ‌ర్చామ‌ని వైద్యులు చెప్పారు.

ఈ ప‌రిక‌రం అత‌డి భుజాల మీదుగా నల్లటి బ్యాగ్‌లా కనిపిస్తుంది. గ‌త ఏడాది ఓ మహిళకు కూడా ఇలాంటి పరికరాన్నే అమర్చగా, ఆమె కొన్నిరోజులకే మృతి చెందింది. ఇప్పుడు దోషికి అమర్చిన ప‌రిక‌రం మాత్రం విజయవంతమైందని, ఇది కృత్రిమ గుండె కాదని, ఉన్న గుండెను మెరుగ్గా పనిచేయించడానికి ఉపయోగపడే పరికరమ‌ని చెప్పారు. ఐదేళ్ల క్రితం దోషికి గుండెపోటు వ‌చ్చింద‌ని, దాంతో అతడికి హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఏర్పడిందని వివ‌రించారు. దీంతో 30 కిలోల బరువు కోల్పోయిన దోషికి నిలబడేందుకు కూడా వీలయ్యేది కాదని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. 

More Telugu News