: అమెరికా, రష్యాల కన్నా శక్తిమంతమైన అణురహిత బాంబు భారత్ వద్ద ఉంది!
ఇటీవలే ఆఫ్ఘనిస్థాన్లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రస్థావరంపై అగ్రరాజ్యం అమెరికా అతిపెద్ద బాంబుగా పిలిచే అణు రహిత మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ను వదిలి సుమారు 100 మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. ఈ బాంబే ప్రపంచంలో అతిపెద్ద బాంబుగా అమెరికా పేర్కొంది. ఆ బాంబుపై స్పందించిన రష్యా తమ వద్ద కూడా అటువంటి బాంబే ఉందని దాని పేరు ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని చెప్పింది. కాగా, భారత్ వద్ద రేడియేషన్ కలిగించని శక్తిమంతమైన బాంబులు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. సంప్రదాయ పేలుడు పదార్ధాల కంటే 15 రెట్లు అధిక శక్తిమంతమైన 'సీఎల్-20' అనే పేరు గల బాంబును మన డీఆర్డీవో ఆరేళ్ల క్రితమే అభివృద్ధి చేసింది. ఈ బాంబును ఎలా ప్రయోగిస్తారు? అనే విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచారు.
దానితో పాటు మన వద్ద స్మార్ట్ ప్రిసైజ్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టీవ్(ఎస్పీఐసీఈ) అనే మరో అతి శక్తిమంతమైన బాంబు ఉంది. దీన్ని స్పైస్ అని పిలుచుకుంటున్నారు. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కార్గో విమానాల నుంచి దీన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. భారత్ వద్ద గల మిరేజ్ 2000, సుఖోయ్ జెట్ల నుంచి సులువుగా తీసుకెళ్లవచ్చు. ఉగ్ర స్థావరాలను నేల మట్టం చేయాలనుకుంటే భారత్ మొదట ఉపయోగించేది ఈ బాంబునే. ఇజ్రాయెల్కు చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ స్పైస్ ను అభివృద్ధి చేసి భారత్కు అందించింది. దీని బరువు కూడా 1000 కిలోలు మాత్రమే.