: ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సిద్ధమే: బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సీఎం చంద్రబాబు ఈ రోజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా తాము సిద్ధ‌మేన‌ని రాష్ట్ర ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... త‌మ‌ పార్టీ గ్రాఫ్‌ తగ్గుతోందన్న సీఎం చంద్రబాబు మాటలు నిజమైతే కనుక వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల స్థానాల్లో టీడీపీ ఉప ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదని ఆయన అన్నారు.  

మరోవైపు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతుల స‌మ‌స్య‌లను ప‌రిష్కారించాల‌ని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ నెల 26, 27వ తేదీల్లో గుంటూరు వేదిక‌గా రెండు రోజుల దీక్ష‌కు దిగుతార‌ని ఇటీవ‌లే ఆ పార్టీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ దీక్ష వాయిదా ప‌డిన‌ట్లు బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. జ‌గ‌న్ త‌ల‌పెట్టిన దీక్ష వ‌చ్చేనెల 1, 2 తేదీల్లో జ‌రుగుతుందని వివ‌రించారు. రాష్ట్రంలో మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కుంటున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వం రైతుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని, వారి తరఫున త‌మ పార్టీ పోరాటం జరుపుతుంద‌ని ఆయ‌న అన్నారు. మ‌రోవైపు రుణ మాఫీ కూడా కాక‌పోవ‌డంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని బొత్స ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం మాటల సర్కారుగానే మిగిపోతోంద‌ని, చేతల సర్కార్‌ కాదని ఆయ‌న అన్నారు. త‌మ దీక్ష‌కు రైతులంతా మద్దతు ఇవ్వాలని కోరారు.  

More Telugu News