: కారును 50 గంటలపాటు ముద్దు పెట్టుకుంది.. కియా ఆప్టిమా ఎల్‌ఎక్స్‌ కారును సొంతం చేసుకుంది!

అమెరికాలోని టెక్సాస్‌లో ఓ సంస్థ నిర్వ‌హించిన‌ వినూత్న పోటీల్లో పాల్గొన్న ఓ యువ‌తి కారును 50 గంటలపాటు ముద్దు పెట్టుకుని విజేతగా నిలిచి కియా ఆప్టిమా ఎల్‌ఎక్స్‌ కారును సొంతం చేసుకుంది. స‌ద‌రు కంపెనీ నిర్వ‌హించిన ఈ ‘కిస్‌ ఏ కియా’ పోటీకి ఐహార్ట్‌ రేడియోస్టేషన్‌ 96.7 కిస్‌ ఎఫ్‌ఎం స్పాన్సరర్ ‌గా వ్యవహరించింది. ఈ పోటీలో 20 మంది పాల్గొన్నారు. ఈ పోటీలో 50 గంటల తర్వాత పోటీదారులు కారుకు తమ పెదాలను ఆనించే ఉంచాలి. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ మంది ఈ పోటీలో గెలిస్తే లాటరీ పద్ధతి ద్వారా విజేత‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

పోటీల్లో పాల్గొనే వారికి ప్రతి గంటకు 10 నిమిషాల స్మాల్ బ్రేక్ కూడా ఉంటుంది. ఆ సమయంలోనే పోటీదారులు ఏదైనా తాగడం, మరుగుదొడ్డికి వెళ్లడం, విశ్రాంతి తీసుకోవడం వంటి ప‌నులు చేసుకోవ‌చ్చు. పోటీ స‌మ‌యంలో ఒక‌వేళ‌ పెదాలు కారుకు ఆనించకుండా ఉంటే వారు ఓడిపోయిన‌ట్లు. పోటీ పెట్టిన కొన్ని గంట‌ల‌కే విసుగెత్తిపోయిన ఐదుగురు పోటీదారులు మధ్యలోనే వెళ్లిపోయారు. మరికొందరు పోటీ నిబంధనలు అతిక్రమించడంతో వారిని నిర్వా‌హకులు పోటీ నుంచి త‌ప్పించారు. మంగళవారం మధ్యాహ్నానికి పోటీ పడేవాళ్ల సంఖ్య 11కి పడిపోయిందని పోటీ నిర్వాహ‌కులు చెప్పారు. పోటీలో పాల్గొన్న కొంద‌రి పెదాల‌కు బొబ్బలు కూడా వ‌చ్చాయి.

నిన్న‌ ఉదయం 9 గంటలకు గడువు పూర్తి కాగా, అప్పటికి 7గురు అభ్యర్థులు విజేత‌లుగా నిలిచారు. అయితే, ఒక్క‌రికే  కియా ఆప్టిమా ఎల్‌ఎక్స్‌ కారు బ‌హూక‌రించాలి కాబ‌ట్టి, ముందుగా ప్ర‌క‌టించినట్లే లాటరీ తీసి అస్టిన్‌కు చెందిన 30 ఏళ్ల యువతి దిలిన్‌ జయసూర్యను విజేతగా ప్ర‌క‌టించి, కారును అందించారు. మిగిలిన విజేత‌ల‌కు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు.

More Telugu News