: ఎస్ఐపై గల్లా అరుణ అనుచరుల దాడి!

చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలో ఉన్న తిరుచానూరులో ఎస్ఐపై టీడీపీ నేత గల్లా అరుణకుమారి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు .. నిన్న రాత్రి తిరుచానూరు ఎస్ఐ రామాంజనేయులు స్థానిక సింథూ జంక్షన్ వైపు వెళుతున్నాడు. ఆ సమయంలో నలుగురు యువకులు ఓ ఆటో డ్రైవర్ తో గొడవపడటాన్ని ఆయన గమనించారు. దీంతో, ఆ యువకులను వారించే ప్రయత్నంలో ఎస్ఐకి, యువకులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో ఓ యువకుడిపై ఎస్ఐ చేయి చేసుకున్నారు. దీంతో, ఆ నలుగురు యువకులు ఎస్ఐపై దాడి చేసి పారిపోయారు. అయితే, స్టేషన్ కు వెళ్లిన ఎస్ఐ ఈ విషయాన్ని సీఐ దృష్టికి తెచ్చారు. దాడికి పాల్పడ్డ యువకులు అధికార పార్టీకి చెందిన వారు కనుక చూసీ చూడనట్టుగా వ్యవహరించాలని బాధిత ఎస్ఐ కు సీఐ సలహా ఇచ్చినట్టు సమాచారం. దీంతో, ఎస్ఐ మనస్తాపం చెందారని, ఈ విషయమై ఎస్పీని ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News