: మూడు దేశాలను బూడిద చేస్తానంటూ కిమ్ జాంగ్ ఉన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. తమను తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించారు. తమతో జాగ్రత్తగా ఉండాలని, కయ్యానికి అసలే కాలుదువ్వొద్దని ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కు వార్నింగ్ ఇచ్చారు. దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలతో కలిసి డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ పటం నుంచి తమ దేశాన్ని మాయం చేయాలని కుట్ర పన్నారని...అయితే అది అసాధ్యమని ఆయన చెప్పారు. తనకు తిక్కరేగితే అమెరికాతోపాటు దక్షిణ కొరియా, జపాన్ దేశాలను బూడిదకుప్పగా మార్చేస్తానని హెచ్చరించారు. అమెరికా తమ మీదకు దాడికి దిగడానికి ముందే తమ అణ్వాయుధాలతో కోలుకోలేని దెబ్బ తీస్తామని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సిరియా వైమానిక స్థావరంపై దాడి, అఫ్ఘనిస్థాన్ లో భారీ బాంబును అమెరికా ప్రయోగించడం ఉత్తరకొరియాను భయపెట్టడంలో భాగమని, అలాంటి బెదిరింపులకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ భయపడే రకం కాదని, దీంతోనే తొలుత దక్షిణ కొరియాలో సైనిక విన్యాసాల పేరుతో దూకుడు ప్రదర్శించిన అమెరికా...అకారణంగా విన్యాసాలు చేసి, తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించిన ఉత్తరకొరియాను తక్కువ అంచనా వేశామని గ్రహించి వెనక్కి తగ్గిందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే అమెరికా మాత్రం మొదట మాటల్తో మొదలు పెట్టామనీ, తరువాత చర్చల ద్వారా సమస్య పరిష్కరిస్తామని, అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే ఎలాంటి పరిణామాలకయినా సిద్ధమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కాగా, చైనా తీవ్రంగా వ్యతిరేకించే అమెరికా, జపాన్ దేశాలు రెండూ ఉత్తరకొరియాకు శత్రుదేశాలు కావడం వ్యూహమా? కాకతాళీయమా?

More Telugu News