: తమిళనాడు రాజ్ భవన్ కు మారిన రాజకీయాలు... పన్నీరు సెల్వం పంతం నెగ్గించుకున్నారా?

తమిళనాడు రాజకీయాలు రాజ్ భవన్ కు చేరాయి. గత రెండు రోజులుగా తీవ్ర మలుపులు తిరిగిన తమిళనాడు అన్నాడీఎంకే రాజకీయాలు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు వద్దకు చేరాయి. గవర్నర్ విద్యాసాగరరావును ఎడిప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ఆర్థిక మంత్రి జయకుమార్ రాజ్ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా తమిళనాడులో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ కు వివరించారు. ఈ నేపథ్యంలో తమిళనాట పన్నీరు సెల్వం మాటనెగ్గించుకున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ కుటుంబాలను బహిష్కరించాలని షరతుపెట్టిన పన్నీరు సెల్వం దానిని సాధించుకున్నారు. అనంతరం పార్టీ జనరల్ సెక్రటరీగా తానే కొనసాగాలని డిమాండ్ చేశారు. దీనిని కూడా పళనిస్వామి వర్గం అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ జనరల్ సెక్రటరీయే ముఖ్యమంత్రిగా కొనసాగడం సంప్రదాయమని, అంతేకానీ, పార్టీ జనరల్ సెక్రటరీ ఒకరి వద్ద మంత్రిగా వుండే సంప్రదాయం లేదని పన్నీరు సెల్వం వర్గం మెలిక పెట్టింది. దీంతో విలీన ప్రక్రియ ఆగిపోయింది. పళనిస్వామితో పన్నీరు సెల్వం సమావేశమైన అనంతరం దీనిపై ఒక స్పష్టత వచ్చిందని చెబుతూ, తంబిదురై, జయకుమార్ గవర్నర్ ను కలిసేందుకు వెళ్లిన నేపథ్యంలో తమిళనాడులో పన్నీరు సెల్వం పంతం నెగ్గించుకున్నారని, అధికార బదిలీ జరుగుతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి. 

More Telugu News