: నేను రైల్లో పాటలు పాడి డబ్బులు తీసుకునేవాడిని : బాలీవుడ్ సింగర్ కమ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా

తాను గతంలో రైల్లో పాటలు పాడి డబ్బులు తీసుకునేవాడినని బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా తెలిపాడు. 'విక్కీ డోనర్', 'దమ్ లగాకే హైసా' వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరుతెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా నటన కంటే ముందే సింగర్ గా బాలీవుడ్ కు పరిచయమయ్యాడు.

'మేరీ ప్యారీ బిందు' సినిమా ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా పాటలు తాను, పరిణీతి చోప్రా కలసి పాడామన్నాడు. పరిణీతి మామూలు సింగర్ అయితే, తాను మాత్రం రైల్లో పాటలు పాడేవాడినని చెప్పాడు. కాలేజీ రోజుల్లో తాను స్టేజ్ షోలు, లైవ్ షోలు, వీధినాటకాలు వేసేవాడనని చెప్పాడు. ఆ సమయంలోనే ఢిల్లీ నుంచి ముంబైకి 'పశ్చిమ్ ఎక్స్ ప్రెస్' అనే ట్రైన్ ఉండేదని గుర్తు చేసుకున్నాడు. ఆ ట్రైన్ తన స్నేహితులతో కలిసి ఎక్కేవాడినని, ఆ సమయంలో తన స్నేహితులతో కలిసి ట్రైన్ లో పాటలు పాడేవాడినని, అలా ప్రయాణికుల నుంచి సేకరించిన డబ్బులతో గోవా ట్రిప్ కు వెళ్లేవారమని ఆయుష్మాన్ ఖురానా తెలిపాడు. అందుకే తనను ట్రైన్ సింగర్ అని కూడా అనవచ్చని తెలిపాడు. 

More Telugu News