: రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు!: రోజా నిప్పులు

వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి సీఎం చంద్రబాబునాయుడిపై విరుచుకుపడ్డారు. ఏపీలో పాలన అత్యంత అధ్వానంగా మారిందన్న విషయం ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని, తన కుమారుడి కోసమే మంత్రి పదవులు, ప్రభుత్వం అన్నట్టుగా ఆయన తయారయ్యారని నిప్పులు చెరిగారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన ఆయన, తన కుటుంబంలోని లోకేష్ కు ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని, ఆపై వెంటనే మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారని అది మినహా రాష్ట్రంలోని ఏ కుటుంబానికి ఆయన ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు.

ప్రతి పేదకూ ఇల్లు కట్టిస్తానన్న హామీని ఆయన నిలబెట్టుకోలేదని, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఒక్క ఇల్లూ కట్టని చంద్రబాబు, పక్క రాష్ట్రంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఇంద్రభవనం వంటి సొంతిల్లు నిర్మించుకున్నాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు వాటాలు వేసుకుని పంచుకుని, రూ. 2 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని రోజా దుయ్యబట్టారు.

More Telugu News