: నిర్మాతల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న విశాల్!

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన సినీ నటుడు విశాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి సినిమా టికెట్ లో ఒక రూపాయి రైతులకు కేటాయించాలంటూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు నిర్మాతలు అభ్యంతరం చెప్పారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న తాము అందులో రూపాయి వదులుకోవడమా? అంటూ అభ్యంతరం చెప్పారు. దీనికి పరిష్కారం చూపిస్తామన్న విశాల్... వారికి సరికొత్త ఆదాయ మార్గం చూపించాడు.

తమిళనాడులో ఉన్న న్యూస్ ఛానెళ్లకు ట్రైలర్లు, క్లిప్పింగులు, పాటలు ఉచితంగా వేసుకునేందుకు అంగీకరించవద్దని సూచించాడు. టీవీ చానెళ్లు తమ సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు, హాస్యసన్నివేశాల క్లిప్పింగులు, పాటలు వేయడం ద్వారా టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటున్నాయని, ఒకరకంగా తమ సినిమాలకు సంబంధించిన వాటి వల్లే వారికి ఆదాయం చేకూరుతుందని, అందులో వాటా ఇవ్వడంలో తప్పులేదని పేర్కొన్నాడు.

 అందుకే ఇకపై ఉచితంగా వాటిని వాడుకునే అవకాశం ఇవ్వవద్దని, వేస్తే డబ్బులు డిమాండ్ చేయాలని ఆయన సూచించాడు. టీవీ చానెళ్లకు టీఆర్‌పీ రేటింగ్స్‌ ఆధారంగా ధరలు నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్‌ రైట్స్‌ తీసుకునేందుకు విముఖత చూపుతున్న టీవీ చానెళ్లు అవే సినిమాల పాటలు, ట్రైలర్లు, కామెడీ క్లిప్పింగ్‌లను మాత్రం ఉపయోగించుకుంటూ క్యాష్‌ చేసుకుంటాయన్నాయని నిర్మాతలు పేర్కొంటున్నారు. కాగా, ఒక సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే టీవీ చానెళ్లు దీనిని అంగీకరిస్తాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

More Telugu News