: ‘అమ్మ’ సమాధి సాక్షిగా విలీనం.. వడివడిగా అడుగులేస్తున్న ఈపీఎస్, ఓపీఎస్!

జయలలిత సమాధి సాక్షిగా శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి  పన్నీర్ సెల్వం.. ఇప్పుడు అదే ‘అమ్మ’ సమాధి సాక్షిగా అన్నాడీఎంకేలో విలీనం కావాలని యోచిస్తున్నారు. విలీనంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన పన్నీర్ సెల్వం (ఓపీఎస్), ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) వర్గాలు ఏకతాటిపైకి వచ్చేందుకు వడివడిగా అడుగులేస్తున్నాయి. మంగళవారం రాత్రి దినకరన్ కుటుంబం మొత్తాన్ని పార్టీ నుంచి వెలివేస్తున్నట్టు అన్నాడీఎంకే ప్రకటించింది.

బుధవారం ఉదయం ముఖ్యమంత్రి ఈపీఎస్ కొందరు మంత్రులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.  సాధ్యమైనంత తొందరగా విలీనం జరిగేలా చూడాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు అటు ఓపీఎస్ కూడా తన నివాసంలో కొందరు నేతలతో భేటీ అయి విలీనంపై చర్చించారు. గురువారం మరోసారి పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వం మీడియాకు తెలిపారు. కాగా, పార్టీలోకి ఓపీఎస్ రాక ఖాయం కావడంతో ఇన్నాళ్లూ విమర్శించిన మంత్రులే ఆయనను విపరీతంగా పొగిడేస్తున్నారు. విశ్వాసానికి ఆయన ప్రతీక అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

More Telugu News