: ఏం చేయాలో అర్థంకాని స్థితిలో కట్టప్ప అండ్ బాహుబలి టీమ్!

భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'బాహుబలి-2' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓ అంశం సినిమా యూనిట్ సభ్యులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కర్ణాటకలోని ఒక్క థియేటర్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనివ్వబోమంటూ కన్నడిగులు తెగేసి చెబుతున్నారు. పదేళ్ల క్రితం కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు అనుకూలంగా, కర్ణాటకకు వ్యతిరేకంగా కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో, కన్నడిగులకు సత్యరాజ్ క్షమాపణ చెబితేనే సినిమాను రిలీజ్ చేయిస్తామని, లేకపోతే అడ్డుకుంటామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కట్టప్ప దిష్టి బొమ్మలను వారు తగలబెడుతున్నారు.

ఈ నేపథ్యంలో కన్నడిగులకు కట్టప్ప సత్యరాజ్ క్షమాపణలు చెప్పినా... ఈ సినిమాకు మరో పెద్ద సమస్య వచ్చి పడుతుంది. కర్ణాటకకు సత్యరాజ్ క్షమాపణలు చెబితే, తమిళ తంబీలకు ఆగ్రహం కలుగుతుంది. దీంతో, ఈ సినిమాను తమిళనాడులో ఆడనివ్వబోమంటూ వారు ఆందోళనకు దిగుతారు. దీంతో, సమస్య కర్ణాటక నుంచి తమిళనాడుకు మారుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థంకాక కట్టప్ప, బాహుబలి యూనిట్ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 28న 'బాహుబలి-2' విడుదల కాబోతోంది. ఈలోగా కన్నడిగులు శాంతిస్తారో? లేదో? వేచి చూడాలి.

More Telugu News