: అజిత్ దోవల్ పై పగతీర్చుకునేందుకు ఓంపురి ఆత్మ ముంబైలో తిరుగుతోందట: పాకిస్థాన్ మీడియా తలాతోక లేని కథనం

పాకిస్థాన్ మీడియా చైనా మీడియాను అనుసరిస్తోంది. భారత్ పై ఏదో ఒకలా విషం చిమ్మడం ద్వారా పాప్యులారిటీ పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు చెందిన బోల్ న్యూస్ అనే టీవీ ఛానెల్ తలా తోక లేని కథనాన్ని వండి వార్చి బోడిగుండుకి మోకాలికి లింకు పెట్టే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఆ ఛానెల్ ఏం చెప్పిందంటే... బాలీవుడ్‌ లోనే కాక పాకిస్థాన్, బ్రిటన్, హాలీవుడ్ చిత్రాల్లో నటించి పేరుప్రఖ్యాతులు సంపాదించిన ఓంపురి (66) గత జనవరి 6న కన్నుమూశారు.

అనంతరం ఓంపురి ఆత్మ ముంబైలోని ఆయన నివాసం ముందు తిరుగుతోందని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పై పగతీర్చుకునేందుకు అది అక్కడ తిరుగుతోందని చెబుతూ...ఒక వీడియోను ప్రసారం చేసింది. సీసీ టీవీ ఫుటేజి అయిన ఆ వీడియోలో తెల్ల కుర్తా ధరించిన ఓ వ్యక్తి కనిపించగా, అది ఓంపురి ఆత్మ అని, ముంబైలోని తన ఇంటి ముందు తిరుగుతోందని బోల్ న్యూస్ పేర్కొంది. దీనిని ఆ టీవీ ఛానెల్ గత జనవరి 14న ప్రసారం చేయగా, పాక్ కుట్రలు, కుతంత్రాలను బయటపెడుతూ ‘ఆజ్‌ తక్’ ఆ వీడియాను మొన్న వారాంతంలో ప్రసారం చేసింది.

 ఇంతకీ దోవల్ పై ఓంపురి ఆత్మ ఎందుకు పగబట్టిందంటే...యురి సెక్టార్ లో దాడుల విషయంలో ఓంపురి వ్యాఖ్యలు చర్చనీయమైన సంగతి తెలిసిందే... దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, అజిత్ దోవల్ కలిసి ఓంపురి హత్యకు పథకం వేశారని... ఓంపురికి అజిత్ దోవల్ సమన్లు జారీ చేసి, విచారణలో దారుణంగా కొట్టారని, అందుకే ఓంపురి ఆత్మ పగతీర్చుకోవాలని చూస్తోందంటూ కథనం వండి వార్చింది. దీనిపై ఒళ్లు మండిన ఓ నెటిజన్.. ఓంపురి ఆత్మ పాకిస్థాన్‌ లోనే తిరుగుతోందని కౌంటర్ సెటైర్ ఇచ్చాడు. 

More Telugu News