: ‘ది మహాభారత్’లో భీముడిగా మోహన్ లాల్.. సంతోషం వ్యక్తం చేసిన సూపర్ స్టార్!

వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ తో ‘ది మహాభారత్’ సినిమాను తెరకెక్కించేందుకు యూఏఈకి చెందిన వ్యాపారవేత్త ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్న ‘ది మహాభారత్’లో భీముడి పాత్ర గురించి ప్రధానంగా ఉంటుంది. ఈ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పోషించనున్నారు. ఈ విషయాన్ని మోహన్ లాల్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు.

‘ఈ చిత్రంలో భీముడి పాత్రను నేను పోషిస్తున్నానని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. దీనిని నాకు లభించిన ప్రత్యేక అవకాశం, అదృష్టంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి ఈ పాత్ర పోషించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కథను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తే, ఉత్తమమైన పద్ధతిలో అందంగా కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించాలి ... భారతదేశ సంస్కృతిని చాటిచెప్పే అంశాన్ని ఎంపిక చేసుకుని,1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న మిస్టర్ షెట్టి లాంటి వ్యక్తులకు నా శాల్యూట్..’ అని మోహన్ లాల్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, వచ్చే ఏడాదిలో ఈ చిత్రం మొదటి భాగం షూటింగ్ జరుగుతుందని, 2020 నాటికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది.

More Telugu News