: బ్యాటింగ్ లో రాణించిన ఢిల్లీ డేర్ డెవిల్స్...మూడు వికెట్లు కోల్పోయిన కోల్ కతా నైట్ రైడర్స్

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న ఐపీఎల్ 18వ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆకట్టుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీకి ఓపెనర్లు సంజూ శాంసన్‌ (39), శామ్‌ బిల్లింగ్స్‌ (21) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరి దూకుడుతో కేవలం 6 ఓవర్లకే తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం లభించింది. అనంతరం కరుణ్‌ నాయర్‌ (21) తొలిసారి ఫర్వాలేదనిపించగా, శ్రేయస్‌ అయ్యర్‌ (26) ఆకట్టుకున్నాడు. అనంతరం భవిష్యత్ టీమిండియా కీపర్ గా వెటరన్ ల ప్రశంసలందుకుంటున్న రిషబ్‌ పంత్‌ (38) ధాటిగా ఆడాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో ఆకట్టుకున్నాడు.

టీమిండియా స్పీడ్ స్టర్ ఉమేశ్‌ యాదవ్ వేసిన 17వ ఓవర్‌ లో 0, 6, 4, 6, 6, 4 లతో 26 పరుగులు పిండుకోవడం విశేషం. అనంతరం చివర్లో క్రిస్‌ మోరిస్‌ (16) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ షాకిచ్చాడు. తొలి రెండు ఓవర్లలో గ్రాండ్ హోం (1), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (14) ను పెవిలియన్ కు పంపాడు. ఊతప్ప (4) ను కుమ్మిన్స్ అవుట్ చేశాడు. దీంతో మూడు వికెట్లు కోల్పోయిన గంభీర్ జట్టు ఐదు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. క్రీజులో యూసుఫ్ పఠాన్ (12), మనీష్ పాండే (3) ఉన్నారు. 

More Telugu News