: చిక్కుల్లో శశికళకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు!

జయలలిత మరణించిన తరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా, పన్నీర్ సెల్వంను వ్యతిరేకించి, శశికళ వర్గంలో ఉండిపోయిన 122 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వీరందరి ఆస్తి పాస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలపై ఆదాయపు పన్ను అధికారులు దృష్టిని సారించారు. అమ్మ మరణం తరువాత క్యాంపు రాజకీయాల్లో భాగంగా వీరంతా కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపంలోని కువత్తూరు రిసార్టులో ఉన్న సమయంలో ఎవరికి ఎంత ముట్టింది? ఏఏ కాంట్రాక్టులను ఎవరికి అప్పగించారు? ఎవరికి ఏం హామీలు ఇచ్చారు? తదితర విషయాలపై కూపీ లాగుతున్న ఐటీ అధికారులు, ప్రత్యర్థి వర్గంలోకి వెళ్లకుండా ఒక్కొక్కరికీ రూ. 5 కోట్ల చొప్పున పంచినట్టు విపక్షాలు చేసిన విమర్శల ఆధారంగా విచారణ ప్రారంభించారు.

పలువురికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని గుర్తించి, వారి ఖాతాల వివరాలను సేకరించే పనిని ముమ్మరం చేశారు. ఇటీవలి ఆర్కే పురం ఉపఎన్నిక రద్దు అనంతరం, మంత్రులు, ఆయన సహాయకులు, కుటుంబ సభ్యులు, సినీ నటుల ఇళ్లలో సోదాలు జరిపిన ఐటీ, ఇప్పుడు అధికార పార్టీలోని అందరు ఎమ్మెల్యేల వివరాలూ సేకరిస్తుండటం గమనార్హం.

More Telugu News