: ‘వివో జియో క్రికెట్ మానియా’ పేరుతో మరో ఆఫర్!

భారత టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో.. తాజాగా ''వివో జియో క్రికెట్ మానియా'' పేరుతో ఓ సరికొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్‌కింద వివో స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల‌కు 168 జీబీ వరకు జియో 4జీ డేటాను అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ ఆఫ‌ర్ కోసం వివో స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారులు తమ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ను ఎంపిక చేసుకొని జియో కంపెనీకి ఎస్ఎంఎస్ చేయాలి.

అంతేగాక‌, వచ్చే పది రీఛార్జ్ లలో అంటే జూన్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు చేసుకునే రీఛార్జ్ లలోనూ వివో వినియోగ‌దారులు త‌మ ఖాతాపై అదనపు డేటా ప్రయోజనాలు పొందవ‌చ్చు. అయితే, ఈ డేటా ప్ర‌యోజ‌నాలు కావాలంటే కచ్చితంగా ప్రతి నెలా రూ.303తో రీఛార్జ్ చేసుకోవాలి.

ఇక 168జీబీ డేటాను పొందడానికి ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ పేరును 59009 నెంబరుకు జియో వెబ్ సైట్ లో ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఎస్ఎంఎస్ చేయాలి. వీటికి సంబంధించిన ప‌లు వివ‌రాల‌ను జియో త‌మ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఐపీఎల్‌-10 సీజ‌న్‌లో మీ ఫేవ‌రేట్‌ టీమ్ గెలిస్తే 168జీబీ వరకు 4జీ డేటా మీకు ఉచితంగా అందుతుంది. ఈ ఐపీఎల్ సీజన్ కు వివో ప్ర‌ధాన‌ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న విష‌యం తెలిసిందే.

More Telugu News