: జవాన్లపై దాడి చేసిన అల్లరి మూకపై కేసు నమోదు చేసిన పోలీసులు

బుద్గామ్ జిల్లాలో శ్రీనగర్ లోక్‌ సభ ఉప ఎన్నికల విధులు ముగించుకుని వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లతో అనుచితంగా ప్రవర్తించి, దాడి చేసిన కశ్మీర్ వేర్పాటువాద అల్లరిమూకల వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్... స్వాతంత్ర్యం కావాలంటే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించారు. చేతిలో ఏకే 47 రైఫిల్ ఉన్నప్పటికీ, ఆ దాడిని, అవమానాన్ని మౌనంగా భరించిన ఓ సైనికుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే ఇంకో దేశంలో జరిగితే ఏం జరిగి ఉండేదో అందరికీ తెలిసిందేనని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు.

 ఈ నేపథ్యంలో దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు సీఆర్పీఎఫ్ చర్యలు ప్రారంభించింది. ఈ వీడియోలను జాగ్రత్తగా పరిశీలిస్తున్న సీఆర్పీఎఫ్... తమ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించి దాడి చేసిన వారిని గుర్తుపట్టే ప్రయత్నంలో ఉంది. నష్రుల్లాపొర ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై 8 మంది స్థానిక యువకులు దాడి చేసి, దుర్భాషలాడుతూ దానిని సెల్ ఫోన్లలో చిత్రీకరించినట్టు గుర్తించారు. వీరందరిపై కేసులు నమోదు చేయనున్నామని తెలిపారు.

More Telugu News