: ఇంత అవమానాన్ని ఎలా మరచిపోయారు?: టీడీపీపై పవన్ కల్యాణ్ నిప్పులు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు పోరాడుతున్నారని కితాబిచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఇదే విషయమై తెలుగుదేశం వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఘోర అవమానాన్ని టీడీపీ ఎంపీలు మరచిపోయినట్టు అనిపిస్తోందని అన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దని తెలుగుదేశం నేతలను కోరుతున్నానని అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కొంత సంయమనంతో వ్యవహరించడం కరెక్టే అయినప్పటికీ, పదేపదే అన్యాయాలు ఎదురవుతుంటే, ఇంకా ఓపికతో ఉండటంతో లాభమేంటని టీడీపీని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మౌనంగా ఉండటం తనకు బాధను కలిగించిందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని టీడీపీ, బీజేపీ కలసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాయన్న విషయాన్ని మరవద్దని హితవు పలికారు. హోదా తెస్తామని తెలుగుదేశం, ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోందని పవన్ వ్యాఖ్యానించారు.


More Telugu News