: ప్రతి ఐదుగురు ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో నలుగురికి నైపుణ్యలేమి: హెచ్డీఎఫ్సీ చైర్మన్‌ దీపక్ పరేఖ్

దేశంలో 3,300కు పైగా ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని, ఈ కళాశాలల నుంచి ప్రతి ఏటా సగటున 15 లక్షల మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులు కళాశాల నుంచి పట్టాలు చేతపట్టుకుని బయటకు వస్తున్నారని, అయితే వీరిలో ఉద్యోగం చేసేందుకు తగిన నైపుణ్యాలు లేవని హౌసింగ్‌ డెవలప్‌ మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ) చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్ లో ఇన్ స్టిట్యూట్ చెయిర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, దీనికి కారణం కేవలం విద్యార్థులే కాదని, ఉపాధ్యాయుల్లో నైపుణ్యలేమి దీనికి కారణమని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో నైపుణ్యం పెరగాలంటే ముందుగా వారికి బోధించే వారు నైపుణ్యాలను పెంచుకోవలసిన అవసరం ఉందని, విద్యార్ధులు కాలేజీల నుంచి పట్టభద్రులై బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసే విధంగా వారిని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

దీనివల్ల పట్టభద్రులు పట్టాపట్టుకుని బయటకు రాగానే ఉద్యోగాలు చేసేందుకు సరైన నైపుణ్యాలు సంతరించుకుంటారని ఆయన తెలిపారు. ప్రస్తుతం కళాశాల నుంచి పట్టాపట్టుకుని బయటకు వస్తున్న ప్రతి ఐదుగురిలో నలుగురు ఉద్యోగాలు చేసేందుకు పనికిరావడం లేదని ఆయన తెలిపారు. ప్రపంచం వేగంగా మారుతోందని, అందుకనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులకు తగిన శిక్షణనివ్వాలని ఆయన సూచించారు. 

More Telugu News