: ఢిల్లీలో మ‌రో ఘోరం... తల్లీకొడుకులను కాల్చి చంపిన వ్య‌క్తి

రాత్రి 11గంట‌ల‌కు ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్య‌క్తి.. ఆ ఇంట్లో భోజ‌నం చేస్తోన్న అంకుశ్‌ (33) అనే వ్య‌క్తితో పాటు అత‌డి త‌ల్లిని కాల్చి చంపేసిన ఘ‌టన‌ దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు చూస్తే.. వ్యాపారంలో వచ్చిన గొడవలతో రాజేష్ జాలీ అనే వ్య‌క్తి త‌న వ్యాపార భాగ‌స్వామి ఖురానా ఇంట్లోకి వ‌చ్చి ఆయ‌న‌ను చంపేయాల‌నుకున్నాడు. అయితే, ఖురానా త‌ప్పించుకున్నాడు. దీంతో ఇంట్లో భోజ‌నం చేస్తోన్న ఖురానా చిన్న కుమారుడు అంకుశ్‌ను, ఖురానా భార్యను చంపేశాడు. త‌న పెద్ద కొడుకు అమిత్ (38)తో పాటు ఖురానా నిందితుడిని పట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు.

ఈ క్ర‌మంలో పదునైన ఆయుధంతో వారిద్దరినీ జాలీ పొడిచేశాడు. ఈ దాడిలో ఆ ఇంట్లో పనిచేసే రాజు అనే వ్యక్తిని కూడా నిందితుడు రాజేష్ జాలీ పొడిచేశాడు. ఆ ఇంట్లో నుంచి పెద్దగా చ‌ప్పుళ్లు రావ‌డంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసులు జాలీని అదుపులోకి తీసుకుని గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి తరలించారు. ఖురానా, అమిత్, రాజుతో పాటు నిందిదుడు రాజేష్ జాలీ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

More Telugu News