: జవాన్‌పై కశ్మీరీ యువత దాడి.. తన ప్రతిస్పందనతో భారత్‌కు గర్వకారణంగా నిలిచిన జవాను!

శ్రీనగర్‌లో పోలింగ్ విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న ఓ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవానుపై కశ్మీరీ యువత దాడి చేసింది. తలవంచుకుని నడుచుకుంటూ వెళ్తున్న అతడిపై యువత ఒక్కసారిగా దాడిచేసి ఇష్టం వచ్చినట్టు కొట్టింది. ఆదివారం ఈ ఘటన జరగ్గా ఎవరో దాడి దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడది వైరల్ అయింది.

తనపై యువత దాడిచేస్తున్నా జవాను శాంతికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించాడు. చేతిలో ఆయుధం ఉన్నా వారికి ఎదురుతిరిగే ప్రయత్నం చేయలేదు సరికదా సహనం వహించాడు. అతడిపై దాడిచేసిన యువత పెద్దపెట్టున నినదిస్తున్నా పట్టించుకోనట్టు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ వీడియోలో యువత జవానును కొట్టడం, తన్నడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో అతడి చేతిలో రైఫిల్ ఉన్నా వారిని కనీసం బెదిరించే ప్రయత్నం కూడా చేయలేదు.

యువత దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తున్నా, చేతిలో తుపాకి ఉన్నా మౌనంగా ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం విని భారతీయుల హృదయాలు ఉప్పొంగాయి. గర్వంతో పులకించాయి. ఆ సమయంలో తన బ్యాగులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం)లు ఉన్నాయని, వాటిని రక్షించే బాధ్యత తనపై ఉందని చెప్పి భారత్‌కు గర్వకారణంగా నిలిచాడు. ఇప్పుడా వీడియో విపరీతంగా షేర్ అవుతోంది.

More Telugu News