: పానీపూరీ ఇవ్వలేదని పొడిచి చంపేశారు!

పానీ పూరి కోసం ఓ వ్య‌క్తిని దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న ఢిల్లీలో అల‌జ‌డి రేపింది. త‌మ‌కు పానీపూరీ ఇచ్చేందుకు రాజు (24) అనే చిరు వ్యాపారి నిరాకరించడంతో కొంత‌మంది అతడిని 18 సార్లు కత్తితో పొడిచారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు గోగి (22), అనిల్‌ (28), నిఖిల్‌ (24) అనే ముగ్గురు నిందితుల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు బాల‌నేర‌స్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... ఔటర్‌ ఢిల‍్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో పానీపూరీ అమ్ముకునే రాజు రాత్రి 11.30 కావ‌డంతో తన షాపు మూసేసి ఇంటికి బయలుదేరాడు. అంతలో ఐదుగురు వ్యక్తులు మద్యం తాగుతూ రాజును ఆపి పానీపూరీ అడిగారు. త‌న వ‌ద్ద లేవ‌ని, సరుకులు అయిపోయాయని రాజు చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ వినిపించుకోని వారు 'ఇస్తావా? చ‌స్తావా?' అంటూ బెదిరించారు.

ఇంతలో ఒకడు కత్తితీసి రాజు పడిపోయేవరకు పొడిచాడు. బాధతో అతను అరవడంతో ఆయ‌న‌ తండ్రితో పాటు స్థానికులు అక్క‌డ‌కు వ‌చ్చారు. దీంతో నిందితులు ప‌రార‌య్యే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, స్థానికులు ఇద్ద‌రిని ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించారు. రాజుని ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. నిందితుల్లో గోగి, అనిల్‌ ఇద్దరికీ గతంలో నేరచరిత్ర ఉంది. మ‌రో నిందితుడు నిఖిల్‌కు ఇప్ప‌టివ‌ర‌కు నేరచరిత్ర లేదు. గోగి అనిల్ లాంటి వారితో తిర‌గ‌డంతో ఆయ‌న‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News