: పాక్‌లో ఉరిశిక్ష పడ్డ కులభూషణ్‌ హిందూస్థాన్ బిడ్డ.. ఆయనకు అండగా ఉంటాం: రాజ్యసభలో సుష్మా స్వరాజ్ ప్ర‌క‌ట‌న

గత ఏడాది అరెస్టయిన భారతీయ నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాధవ్‌కు పాకిస్థాన్‌ ఆర్మీ కోర్టు నిన్న‌ ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఈ రోజు రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం కేంద్ర మంత్రి సుష్మాస్వ‌రాజ్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఓ ప్ర‌క‌టన చేశారు. పాక్‌లో కులభూషణ్‌కు ఉరిశిక్ష నిర్ణ‌యాన్ని భార‌త్ ఖండిస్తోంద‌ని ఆమె తెలిపారు. ఆయ‌న‌పై విచార‌ణ కూడా స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. కుల‌భూష‌ణ్‌కు భార‌త్ అండ‌గా ఉందని ప్ర‌క‌టించారు. పాక్ ఆయ‌న‌పై చేస్తోన్న‌ ఆరోప‌ణ‌లు అవాస్త‌వమేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎలాంటి ఆధారాలు చూప‌కుండానే పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిందని ఆమె పేర్కొన్నారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని స్ప‌ష్టం చేశారు. పాక్ కుట్రపూరితంగా వ్యవ‌హ‌రిస్తోందని ఆమె అన్నారు. కులభూషణ్ హిందూస్థాన్ బిడ్డ అని, ఆయనకు అండగా ఉంటామని తేల్చిచెప్పారు.

More Telugu News