: ఇద్దరు పాక్ జాలరుల ప్రాణాలను కాపాడిన భారత్‌... జైలులో ఉన్నవారిని మాత్రం విడుదల చేయబోమని హెచ్చరిక

భారత్ మరోసారి తన గుణాన్ని చూపించింది. ఇద్దరు పాకిస్థానీ జాలర్ల ప్రాణాలను కాపాడింది. సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు జాలరులను కాపాడిన భారత తీర ప్రాంత గస్తీ దళం.. వైద్య చికిత్స కూడా అందించి వారి ప్రాణాలు నిలబెట్టింది. గత ఏడాది అరెస్టయిన భారతీయ నేవీ మాజీ అధికారి కులభూషణ్‌ జాధవ్‌కు పాకిస్థాన్‌ ఆర్మీ కోర్టు నిన్న‌ ఉరిశిక్ష విధించిన సంగతి విదిత‌మే. మ‌రోవైపు భారత తీర ప్రాంత గస్తీ దళం రెండు రోజుల క్రిత‌మే పాక్ జాలర్ల‌ను ర‌క్షించింది. ఇటీవల పాకిస్థాన్‌ కోస్టు గార్డుకు చెందిన ఓ చిన్నబోటు ఆరుగురు జాల‌ర్ల‌తో పొరపాటున గుజరాత్‌ తీరంలోని సర్‌క్రీక్‌ ప్రాంతానికి వ‌చ్చేసింది. అదే స‌మ‌యంలో ప్రధాన బోటుతో ఇది విడిపోయి సముద్రంలో మునిగిపోయింది. దీంతో పాకిస్థాన్‌ మారిటైమ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్‌.. న్యూఢిల్లీలోని భారత నేవీ అధికారులతో మాట్లాడి సాయం కోరారు. దీంతో భార‌త్ రంగంలోకి దిగి ఇద్ద‌రిని కాపాడింది. మ‌రో నలుగురు పాకిస్థానీ జాలర్లు అప్ప‌టికే మృతి చెందారు.

అయితే, భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్‌భూషణ్‌ జాధవ్‌కు పాకిస్థాన్‌ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించడం ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని మ‌రోసారి తెచ్చిపెట్టేలా ఉంది. పాకిస్థాన్ చ‌ర్య‌ను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయ‌న‌కు మరణశిక్ష అమలుచేస్తే దాన్ని హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరిక‌లు చేయ‌డ‌మే కాకుండా,  భారత జైలులో ఉన్న 12 మంది పాకిస్థాన్‌ జాలర్లను విడుదలను చేయ‌డాన్ని కూడా నిలిపివేసింది.

More Telugu News