: ముంబై తరహా దాడి మళ్లీ జరిగితే భారత్ సహనంతో చూస్తూ ఊరుకోదు: ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ నివేదిక
గత ఏడాది ఉరీలో భద్రతా దళాలపై పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిగా సర్జికల్ స్ట్రయిక్స్ చేసి దీటుగా స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ ప్రతిస్పందనను అంచనా వేస్తే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మోదీ ప్రతిచర్యలు ఉంటాయని తెలుస్తోందని బ్రసెల్స్కు చెందిన ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ తెలిపింది. భారత్లో మరోసారి 26/11 ముంబై తరహా దాడులకు పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద గ్రూపులు తెగబడితే ఇండియా ఇక చూస్తూ ఊరుకోదని, సహనంతో ఉండబోదని తెలిపింది. దక్షిణాసియాలో ఉగ్రవాదంపై అమెరికా విధానాన్ని విశ్లేషిస్తూ ఆ సంస్థ ఓ నివేదిక వెలువరిస్తూ.. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్కు పాకిస్థాన్ ప్రభుత్వ మద్దతు ఉందని స్పష్టం చేసింది.
అయితే, ఈ ఉగ్రవాద సంస్థలతో అమెరికాకు కూడా ముప్పేనని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ చెప్పింది. ఈ ఉగ్రవాద సంస్థలతో అల్ కాయిదాకు నేరుగా సంబంధాలు లేకపోయినప్పటికీ వారు అఫ్గానిస్థాన్, పాకిస్థాన్లలో అంతర్జాతీయ ఉగ్రవాదులతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని నివేదికలో పేర్కొంది.