: ఢిల్లీలో తమిళ రైతుల వింత నిరసన.. మండుటెండలో అర్ధ నగ్నంగా పొర్లుదండాలు!

పలు డిమాండ్లతో ఢిల్లీ చేరుకున్న తమిళనాడు రైతులు వినూత్న, వింతైన నిరసన ప్రదర్శనలతో కేంద్రం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ చేయాలని, కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, కరవు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల 14 నుంచి జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్నారు. మొదట్లో రైతులు పుర్రెలు పట్టుకుని నిరసన తెలిపారు. తర్వాత ఎలుకలు, చచ్చిన పాములను మెడలో వేసుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు.

తాజాగా సోమవారం ఏకంగా మండుటెండలో బట్టలు విప్పేసి నడిరోడ్డుపై పొర్లు దండాలు పెట్టారు. రైతు నేత పి.అయ్యకన్ను నేతృత్వంలోని 9 మంది రైతులు సోమవారం రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించేందుకు రైసినా హిల్స్‌కు వెళ్లారు. పోలీసులు వారిని లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రాష్ట్రపతి భవన్‌కు కొంచెం దూరంలో ఉన్న సౌత్‌బ్లాక్ వద్ద దుస్తులన్నీ విప్పేసి రోడ్డుపై పొర్లు దండాలు పెట్టారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జంతర్ మంతర్ వద్దకు తరలించారు.

More Telugu News