: ఇళయరాజా పంపిన నోటీస్ తో కలత చెందా.. అయినా మేము ఇప్పటికీ స్నేహితులమే!: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఇళయరాజా, తాను ఇప్పటికీ స్నేహితులమేనని, తమ మధ్య భేదాభిప్రాయాలు లేవని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ‘ఎస్పీబీ 50’ వరల్డ్ టూర్ లో ఉన్న బాలసుబ్రహ్మణ్యం ఓ ఛానల్ తో మాట్లాడుతూ, తాను స్వరపరచిన గీతాలను పాడొద్దంటూ ఇళయరాజా తనకు పంపిన నోటీస్ తో తాను కలత చెందానని అన్నారు. తనకూ ఆత్మాభిమానం ఉందని, ఇళయరాజా కానీ, ఆయన ఆఫీసు నుంచి కానీ ఎవరైనా ఒక్క ఫోన్ చేసి, పాటలు పాడవద్దని తనకు సమాచారం ఇస్తే బాగుండేదని, సమస్య అక్కడితోనే సమసిపోయేదని అన్నారు.

సినీ రంగంలోకి రాకముందు నుంచే ఇళయరాజా, తాను స్నేహితులమని చెప్పారు. ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలను పాడేందుకే తాను పుట్టానని అందరూ అంటుంటారని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఇళయరాజా గొప్పఙ్ఞాని అని, ఓ గొప్ప సంగీత దర్శకుడితో కలిసి పని చేశానని, తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, ఈ సమస్యకు కాలమే పరిష్కారం చూపుతుందని అన్నారు. అదృష్టవశాత్తూ, ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన హిట్ పాటలనూ తాను పాడానని, తన వరల్డ్ టూర్ కొనసాగుతుందని బాలు పేర్కొన్నారు.

More Telugu News