: కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నప్పుడు రైతులకు ఎందుకు ఇవ్వరు?: హీరో విశాల్

కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నప్పుడు, రైతులకు ఎందుకు ఇవ్వరని దక్షిణాది సినీ హీరో విశాల్ ప్రశ్నించారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, రైతుల ఆందోళనలకు ఫలితం దక్కడం లేదని, వారి ఆందోళనపై వ్యవసాయ శాఖ మంత్రి స్పందించకపోవడం విచారకరమని అన్నాడు. తెలుగు సహా మిగిలిన సినీ పరిశ్రమలు ముందుకు వస్తే రైతులకు సాయం చేయవచ్చని అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాతల మండలికి ఇటీవల తాను పోటీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. సినీ పరిశ్రమలోని పాత పద్ధతులను ప్రక్షాళన చేసేందుకే తాను పోటీ చేశానని అన్నాడు. తమిళ సినీ పరిశ్రమ వెనకబడిపోయిందని, ఒక నిర్మాతకు రావాల్సిన ఆదాయం రావడం లేదని అన్నాడు. కాగా, ఢిల్లీలో ప్రధాని కార్యాలయం ఎదుట తమిళనాడు రైతులు ఈ రోజు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే విశాల్ పై వ్యాఖ్యలు చేశాడు.

More Telugu News