: చిరంజీవి నాకు చాలా అన్యాయం చేశారు: తమిళ నటుడు రాజ్ కిరణ్ ఆవేదన

మెగాస్టార్ చిరంజీవి తనకు తీరని అన్యాయం చేశారంటూ తమిళ నటుడు రాజ్ కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ పోషించిన పాత్రను తొలుత రాజ్ కిరణ్ పోషించారు. షూటింగ్ 60 శాతం పూర్తయిన తర్వాత ఊహించని విధంగా రాజ్ కిరణ్ ను తప్పించి, ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నారట.

దీనిపై రాజ్ కిరణ్ స్పందిస్తూ, తాను నటిస్తున్నప్పటికే షూటింగ్ 60 శాతం పూర్తయిందని... రషెస్ చూసిన చిరంజీవి తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత కలిగించారంటూ అసహనం వ్యక్తం చేశారని రాజ్ అన్నారు. సినిమాలో లీడ్ రోల్ రామ్ చరణ్ దా? లేక రాజ్ కిరణ్ దా? అని ఆయన ప్రశ్నించినట్టు తనకు తెలిసిందని చెప్పారు. దీంతో, తనను సినిమా నుంచి తప్పించి... పాత్రకు కొన్ని మార్పులు చేసి, ప్రకాశ్ రాజ్ తో నటింపజేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా నుంచి తనను తప్పించడంపై ప్రకాశ్ రాజ్ కూడా అడిగారని... అయితే, మొత్తం సెటిల్ చేసేశాం అంటూ అతనికి సమాధానం చెప్పారని రాజ్ కిరణ్ చెప్పారు. తనకు ఇంకా రూ. 10 లక్షలు రావాలని వెల్లడించారు. ఈ డబ్బుకు సంబంధించి నిర్మాత కానీ, రామ్ చరణ్ కానీ, కృష్ణవంశీ కానీ స్పందించడం లేదని అన్నారు. ఓ నటుడితో ప్రవర్తించే విధానం ఇదేనా? అని ఆయన మండిపడ్డారు. 

More Telugu News