: జగన్ ను కాకపోతే ఇంకెవరిని టార్గెట్ చేయాలి?: కేశినేని నాని

ప్రతివిషయంలోనూ వైసీపీ అధినేత జగన్ నే టీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారనే ప్రశ్నలపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్... ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధిస్తుంటారని... ఈ నేపథ్యంలో, అన్ని విషయాలకు సంబంధించి ఆయనకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఏపీ శాసనసభలో కాంగ్రెస్ లేదు, వామపక్షాలు లేవని... ఇలాంటి పరిస్థితిలో, సభలో ఉన్న ఏకైక విపక్షానికి చెందిన పార్టీ అధినేత జగన్ గురించే మాట్లాడాల్సి ఉంటుందని అన్నారు. జగన్ నే టార్గెట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. జగన్ అంటే టీడీపీ నేతలకు భయం అని, అందుకే ఎప్పుడూ ఆయనను టార్గెట్ చేస్తుంటారనే విమర్శల్లో పస లేదని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి జగన్ అసూయపడుతున్నారని... కుట్రలకు పాల్పడుతున్నారని కేశినేని నాని విమర్శించారు. చిన్న కేసులోనే నాలుగేళ్ల జైలు శిక్షను శశికళ అనుభవిస్తోందని... ఈ లెక్కన చూసుకుంటే, ఎన్నో కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్న జగన్ కు వందేళ్లకు పైగా శిక్ష పడుతుందని చెప్పారు. ఓ వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News