: గుజరాత్ పై తిరుగులేని విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాదు

ఐపీఎల్ లో జట్లు ధాటిగా ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాయి. నిన్న సాయంత్రం జరిగిన మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన గుజరాత్‌ లయన్స్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (31; 21 బంతుల్లో 5×4) దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే అద్భుత బంతితో భువనేశ్వర్ కుమార్ అతనిని అవుట్ చేయడంతో, అంతకు ముందు రషీద్ ఖాన్ మెక్‌ కల్లమ్‌ (5) ను పెవిలియన్ కు పంపాడు. తరువాత వరుస ఓవర్లలో సురేశ్‌ రైనా (5), ఆరోన్‌ ఫించ్‌ (5) లను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి, కుల్‌ కర్ణి (1) రనౌట్‌ లో భాగం పంచుకున్నాడు.

అయితే గుజరాత్ ను మరోసారి దినేశ్‌ కార్తీక్‌ (30) ఆదుకోగా, అతనికి డ్వేన్‌ స్మిత్‌ (37) సహకరించాడు. ఈ జోడీని భువనేశ్వర్ విడదీయడంతో గుజరాత్ లయన్స్ కేవలం 135 పరుగులకు పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (76; 45 బంతుల్లో 6×4, 4×6) శుభారంభం ఇచ్చాడు. ఫామ్‌ లోకి వచ్చిన వార్నర్ సిక్సర్లు, బౌండరీలతో గుజరాత్ లయన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరో వైపు మోజెస్‌ హెన్రిక్స్‌ (52; 39 బంతుల్లో 6×4) కూడా రాణించాడు. వీరిద్దరూ 74 బంతుల్లో 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో కేవలం 15.3 ఓవర్లలోనే సన్‌ రైజర్స్‌ హైదరాబాదు జట్టు ఈ ఐపీఎల్ లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

More Telugu News