: భర్త మృతి వార్తనే బ్రేకింగ్‌ న్యూస్‌ గా చదివిన న్యూస్ రీడర్!

మీడియాలో పని చేసేవారు భావావేశాలకు లోనుకాకుండా విధులు నిర్వర్తిస్తుంటారు. పలు సందర్భాల్లో వ్యక్తిగత ఆలోచనలను, వ్యక్తిగత స్పందనలను మర్చిపోయి విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటి ఘటనే ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకి వెళ్తే... సుప్రీత్‌ కౌర్‌ (28) గత తొమ్మిదేళ్లుగా ఛత్తీస్‌ గఢ్‌ లోని ఓ ప్రముఖ వార్తా ఛానెల్‌ లో న్యూస్‌ రీడ‌ర్‌ గా పనిచేస్తున్నారు. ఆమెకు హర్సద్‌ కవాడే అనే వ్యక్తితో గతేడాది వివాహమైంది. వీరిద్దరూ రాయ్‌ పూర్‌ లోనే నివాసం ఉంటున్నారు. ఈ ఉదయం విధులకు హాజరైన ఆమె రిపోర్టర్ ఇచ్చిన సమాచారం ప్రకారం పితార ప్రాంతంలో ఓ రెనాల్ట్‌ డస్టర్‌ కారు ప్రమాదానికి గురైందని, అందులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురు మృత్యువాతపడ్డారని హెడ్ లైన్స్ లో చదివారు. ఆ కారు తన భర్తదేనని, ఆ కారును నడుపుతున్న వ్యక్తి కూడా తన భర్తేనని, ఆయన మరణించారని ఆమెకు అప్పుడే అర్థమైంది.

అయినప్పటికీ వృత్తి ధర్మాన్ని విస్మరించని ఆమె మనోనిబ్బరంతో బాధను దిగమింగి బులెటెన్‌ ముగించి ఇంటికి వెళ్లారు. అప్పటికే డెస్క్ లో ఈ వార్త తెలుసుకున్న సిబ్బంది విషణ్ణవదనులైపోయారు. దీనిపై వారు స్పందిస్తూ... ‘మహసముండ్‌ జిల్లాలోని పితారా వద్ద రెనో డస్టర్‌ వాహనం ఈ ఉదయం ఘోర ప్రమాదానికి గురైందని, వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడినట్టు డెస్క్ వార్తను ఇవ్వగానే, ఆ కారు తన భర్తదేనని ఆమె గుర్తించారని, అయితే బులెటిన్ మధ్యలో అక్కడి నుంచి వెళ్లిపోకుండా న్యూస్‌ బులెటిన్‌ పూర్తి చేసి వెళ్లారని, ఆమెతో క‌లిసి ప‌నిచేస్తునందుకు తామంతా గ‌ర్వ‌ప‌డుతున్నామని, ఆమె జీవితంలో జరిగిన ఈ దుర్ఘటన తమల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయిన వారంతా దేవుడు ఆమెకు మనోనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు.


More Telugu News