: ఎట్టకేలకు జయలలిత నకిలీ కొడుకు అరెస్టు!

సుదీర్ఘ వెతుకులాట అనంతరం జయలలిత నకిలీ కొడుకు అరెస్టయ్యాడు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, సినీ నటుడు శోభన్ బాబుకు జన్మించానని చెబుతూ కృష్ణమూర్తి (28) అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాను జయలలిత కుమారుడినని, శశికళ నుంచి ప్రాణహాని ఉందని, జయలలితకు సంబంధించిన ఆస్తులన్నీ తనకు అప్పగించాలని కోరుతూ అతను మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కోర్టుకు అతడు సమర్పించిన పత్రాలన్నీ నకిలీలని గుర్తించింది.

దీంతో అతనిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరారీలో ఉన్న కృష్ణమూర్తిని దిండిగల్ బస్టాండ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల అనంతరం కొన్ని రోజులు ఇద్దరు లాయర్ల వద్ద ఆశ్రయం పొందానని కృష్ణమూర్తి తెలిపాడు. ఆ తరువాత రాష్ట్రం మొత్తం ఆర్టీసీ బస్సుల్లో తిరిగానని తెలిపాడు. అలా తిరిగే క్రమంలోనే పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పాడు. అతనిని విచారణ అనంతరం న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. 

More Telugu News