: మహిళలపై పెరుగుతున్న దాడులకు సినిమాలే కారణం!: బాలీవుడ్ పై మేనకా గాంధీ విమర్శలు

బాలీవుడ్ పై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పట్ల జరుగుతున్న ఈవ్ టీజింగ్ కు బాలీవుడ్ బాధ్యత వహించాలని ఆమె అన్నారు. మహిళలపై పెరుగుతున్న దాడులకు సినిమాలే కారణమని మండిపడ్డారు. దాదాపు అన్ని సినిమాల్లో ఈవ్ టీజింగ్ తోనే ప్రేమ మొదలవుతోందని... ప్రాంతీయ భాషా చిత్రాల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతోందని విమర్శించారు.

అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం, వేధించడం, ఆ తర్వాత ప్రేమలో పడటం... అన్ని సినిమాల తీరు ఇలాగే ఉంటోందని అన్నారు. దీంతో, మహిళలపై వేధింపులకు, హింసకు పాల్పడవచ్చనే భావన పురుషుల్లో పెరుగుతోందని తెలిపారు. చేతకాని పురుషులే మహిళలపై హింసకు పాల్పడుతారని... పనిలో వైఫల్యం చెందే పురుషులే మహిళలపై అసహనాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు.

మరోవైపు మేనకాగాంధీ వ్యాఖ్యలపై బాలీవుడ్ విమర్శలు గుప్పిస్తోంది. సినీ పరిశ్రమ శక్తిని తక్కువగా చూడవద్దని నిర్మాత అశోక్ పండిట్ అన్నారు. సినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించడం ఫ్యాషన్ గా మారిందని మండిపడ్డారు. బాలీవుడ్ లో ఎంతో మంది ఎన్నో మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలను తీశారని చెప్పారు.


More Telugu News