: నా రక్తం ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది: అమరనాథ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అమరనాథ్ రెడ్డి తొలిసారిగా నిన్న తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా, టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ఆనంతరం ఆయన మాట్లాడుతూ, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించే హక్కు వైసీపీ అధినేత జగన్ కు లేదని అన్నారు.

2019లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే... పార్టీ ఫిరాయింపుల పేరుతో ఆయన ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవా చేశారు. గతంలో మీ తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఊరుకునేది లేదని హెచ్చరించారు.

గతంలో ఏం ప్రలోభపెట్టి తనను మీతో తీసుకెళ్లారని జగన్ ను అమరనాథ్ రెడ్డి ప్రశ్నించారు. మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి తాము బతకడం లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి తాము టీడీపీలోనే ఉన్నామని చెప్పారు. తన రక్తం ఎప్పుడూ పచ్చగానే ఉంటుందని అన్నారు. టీడీపీ అధికారంలో ఉందని... కార్యకర్తలెవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

More Telugu News