: సినీ నటిని మోసం చేసిన కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు

ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సినీ నటిని మోసం చేసిన కేసులో దర్శకుడు, అతడి  సోదరుడికి శుక్రవారం కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టీవీ ప్రసాద్ కథనం ప్రకారం.. కడపకు చెందిన ఐ.సురేశ్ అలియాస్ సురేశ్ కృష్ణ కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో ఉంటున్నాడు. సినిమాలకు దర్శకత్వం వహించే ఆయన 2012లో ఓ సినిమాకు పనిచేస్తున్నప్పుడు సినీ నటి (25)ని ప్రేమిస్తున్నట్టు నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేశాడు.

ఈ క్రమంలో ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీశాడు. వాటి ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. సెప్టెంబరు 29, 2012న సోదరుడు సతీశ్‌, స్నేహితుడు బుజ్జితో కలిసి సినీ నటిని కారులో అపహరించేందుకు ప్రయత్నించాడు. గుర్తించిన స్థానికులు అడ్డుకోవడంతో ఆమెను వదిలిపెట్టి పరారయ్యాడు. ఈ కేసును విచారించిన 8వ అదనపు సెషన్స్ కోర్టు కిడ్నాప్ నేరం రుజువు కావడంతో దర్శకుడు సురేశ్, అతడి సోదరుడు సతీశ్‌లకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున జరిమానా కూడా విధించింది.

More Telugu News