: దేశంలో గంటకో విద్యార్థి ఆత్మహత్య.. గుండెలు పిండేసే గణాంకాలు వెల్లడించిన ఎన్‌సీఆర్‌బీ

జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) మనసులు పిండేసే గణాంకాలు వెల్లడించింది. దేశంలో గంటకో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడని, 2011 నుంచి 2015 వరకు ఐదేళ్లలో 39,775 మంది ప్రాణాలు తీసుకున్నారని ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక వెల్లడించింది. ఇవి వెలుగులోకి వచ్చినవి మాత్రమేనని, పోలీసులు నమోదు చేయని కారణంగా వెలుగులోకి రానివి వేలల్లో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 15-29 ఏళ్ల మధ్యలో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో భారతీయులే అధికమని 2012 లాన్సెట్ నివేదిక పేర్కొనడం గమనార్హం.

ఇక తాజా ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం.. 2015లో ఆత్మహత్యకు పాల్పడిన 8,934 మందిలో 1,230 మంది (14 శాతం) మహారాష్ట్రవాసులు కాగా, ఆ తర్వాతి స్థానంలో 955 మందితో తమిళనాడు, 625 మందితో చత్తీస్‌గఢ్ నిలిచాయి. విస్తీర్ణం, జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే దేశంలోనే సిక్కిం అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. నిరుద్యోగం కారణంగా ఈ రాష్ట్రంలో 21-30 ఏళ్ల మధ్యనున్న వారిలో 27 శాతం మంది యువత ప్రాణాలు తీసుకుంటోంది. పరీక్షల్లో ఫెయిలవడం, నిరుద్యోగం, మానసిక వ్యాధి నిపుణల కొరతే ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది.

More Telugu News