: టెస్టుల్లో నా ఏకైక వికెట్ నీదే.. గుర్తుంచుకో!: ధోనీ

ఐపీఎల్-10 సీజన్‌లో నిన్న ముంబైతో త‌ల‌బ‌డిన‌ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలిచిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్‌కు మ‌హేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన పంచ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ధోనీ వికెట్ కీపింగ్ చేస్తున్న స‌మ‌యంలో కామెంటేట‌ర్‌గా పీట‌ర్స‌న్‌ ఉన్నాడు. ధోనీ ప‌క్క‌నే ఉన్న మ‌నోజ్ తివారీతో మైక్రోఫోన్‌లో పీటర్సన్ మాట్లాడుతున్నాడు. ఈ నేప‌థ్యంలో 'ధోనీకి చెప్పు.. అత‌ని కంటే నేనే బెస్ట్ గోల్ఫ‌ర్‌'న‌ని అంటూ తివారీతో పీటర్సన్ అన్నాడు. దీంతో ఆ విష‌యాన్ని తివారీ ధోనీకి చెప్పాడు. వెంట‌నే స్పందించిన ధోనీ ‘టెస్టుల్లో నా ఏకైక వికెట్ నీదే’ గుర్తుంచుకో అని మైక్రోఫోన్‌ ద్వారా రిప్లై ఇచ్చాడు. దీంతో పీటర్సన్ పెద్ద‌గా న‌వ్వాడు.

2011లో ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఓ టెస్టులో ధోనీ బౌలింగ్ చేశాడు. ఈ సంద‌ర్భంగానే ధోనీ.. పీట‌ర్స‌న్ వికెట్‌ను తీశాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ ఔట్ కూడా ఇచ్చిన అనంత‌రం రీప్లేల్లో బాల్ పీటర్సన్ బ్యాట్‌ను త‌గ‌ల్లేద‌ని తేలింది. దీంతో థ‌ర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించ‌డంతో ఆ త‌ర్వాత కేపీ ఆ మ్యాచ్‌లో ద్విశ‌త‌కం బాదాడు. ఆ విష‌యాన్ని ఇంకా గుర్తు పెట్టుకున్నాడు ధోనీ. రీప్లేల్లో నాటౌట్ అని తేలినప్పటికీ ఆ మ్యాచ్ లో పీటర్సన్ అవుటయినట్లు ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వ‌డంతో ఆ టెస్టులో పీటర్సన్ ని తాను ఔట్ చేసిన‌ట్లు ధోనీ భావిస్తున్నాడు.

More Telugu News