: నాడు సైకిలెక్కి అమరావతి వెళ్లిన ఏసీటీఓ పద్మ... పోలీసులపై రాళ్లతో దాడి.. మానసిక స్థితి సరిగా లేదంటున్న బంధువులు!

ఏసీటీఓ పద్మ గుర్తున్నారా? హైదరాబాద్ నుంచి విజయవాడకు వివిధ శాఖల అధికారులు తరలుతున్న వేళ, సైకిల్ పై భాగ్యనగరి నుంచి బెజవాడకు చేరుకుని అందరినీ ఆకర్షించిన మహిళా అధికారి. ఇప్పుడామె వైఖరి, ప్రవర్తన తీవ్ర గందరగోళాన్ని, కలకలాన్ని సృష్టించాయి. ప్రస్తుతం తిరువూరులో ఏసీటీవోగా విధులు నిర్వహిస్తున్న ఆమె, ఓ సిమెంట్ షాపుకు వెళ్లి తనిఖీలు చేయాలంటూ హడావుడి చేశారు.

విచిత్రంగా ప్రవర్తిస్తూ, సిమెంట్ బస్తాలను నాశనం చేస్తుండటంతో షాపు యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆపై పోలీసులు అక్కడికి రాగా, వారిపై పద్మ రాళ్లతో దాడి చేశారు. దీంతో మహిళా పోలీసులను పిలిపించిన పోలీసులు, ఆమెను బలవంతంగా అక్కడి నుంచి పోలీసు స్టేషన్ కు తరలించారు. కాగా, కొన్నాళ్లుగా పద్మ మానసిక స్థితి సరిగా లేదని బంధువులు వెల్లడిస్తుండటం గమనార్హం. ఈ ఘటనలో పద్మపై కేసు నమోదు చేయనున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News