: సెల్‌ఫోన్‌ కోసం తమ్ముడితో గొడవ.. అన్న ఆత్మహత్య

సెల్‌ఫోన్ కోసం ఓ బాలుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం నాగులపేటలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు ప‌లు వివ‌రాలు తెలిపారు. ఆ గ్రామంలోని వాసాల రవీందర్‌-అరుణ దంపతులకు హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, నాగేంద్ర‌వ‌ర్మ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రవీందర్‌ ఉపాధి నిమిత్తం సౌదీలో ఉంటున్నాడు. మ‌రోవైపు అరుణ బీడీలు చుట్టే ప‌ని మీద‌ పక్కింటికి వెళ్లింది. అయితే, అదే స‌మ‌యంలో హ‌ర్షవర్దన్‌ (13), అతని తమ్ముడు నాగేంద్రవర్మ ఇంట్లో ఉన్నారు. వారిరువురూ సెల్‌ఫోన్‌తో ఆడుకుంటూ టీవీ చూస్తూ కాల‌క్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ కోసం వారిద్ద‌రు కాసేపు గొడవ పడ్డారు. త‌న త‌మ్ముడు నాగేంద్ర‌వ‌ర్మ‌ తనకు సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడంతో హర్షవర్దన్‌ గదిలోకి వెళ్లి దూలానికి ఉరివేసుకున్నాడు. అనంత‌రం వారి త‌ల్లి వ‌చ్చి కిటికీలోంచి చూసి, త‌మ బంధువుల‌ను పిలిచింది. అంతా క‌లిసి గది తలుపులు తెరిచారు. హర్షవర్దన్ అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయాడు.

More Telugu News