: మావోయిస్టు పార్టీకి బై.. ఎర్ర జెండా పక్కకు... ఓటరుగా నమోదు... గద్దర్ సంచలన నిర్ణయం

ఇక మావోయిస్టు పార్టీని వీడుతున్నానని, ఎర్ర జెండాను పక్కన పెట్టానని విప్లవ గాయకుడు గద్దర్ సంచలన ప్రకటన చేశారు. తాను 'పల్లె పల్లె పార్లమెంటుకు' అనే నినాదంతో జనం ముందుకు వెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. తనపై హత్యాయత్నం జరిగి 20 సంవత్సరాలు జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన మాతృసంస్థ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు ప్రకటిస్తూ, అమర వీరులకు వందనాలు పలికి, చేతిలో ఉన్న ఎర్ర జెండాను పక్కన బెట్టి, బుద్ధుడి జెండా కట్టిన కర్రను ఆయన చేతిలోకి తీసుకున్నారు.

కేవలం మిత్ర వైరుధ్యంతోనే తాను మావోయిస్టు పార్టీని వీడినట్టు తెలిపారు. కేవలం మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం మాత్రమే చాలదని, అంబేద్కర్, పూలేల మార్గం కూడా అవసరమని తాను మావోలతో చర్చించానని తెలిపారు. రెండు దశాబ్దాలుగా నాలో తుపాకీ తూటాలను మోశానని, ఇక రెండు పడవలపై కాళ్లు పెట్టలేనని అర్థమైందని అన్నారు. ఓటరుగా కూడా నమోదు చేయించుకున్నానని, ఇప్పుడు తాను ఏ రాజకీయ పార్టీ సభ్యత్వమూ లేని ఓటరునని స్పష్టం చేశారు.

More Telugu News